14, మే 2025, బుధవారం

భారత మాతృ వందనము.

భారత మాతృ వందనము.
(పహల్గామ్ దాడి సందర్భమున)
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)


 

ఉ.

సర్వ వరాయుధ ప్రకర శక్తి భటుల్ సతతోగ్ర శత్రు రా
డ్గర్వ మడంప నిర్దయను గార్య భరమ్ము వహించిరే సమ
స్తోర్వి ముదావహమ్ముగ మహోగ్ర మనస్కుల నుగ్ర భీష ణా
ఖర్వ ఖలోగ్ర వాదులను గాలుని యింటికిఁ బంపు వారలై

1.         

 

 

 

చం.

అలయక తాఁ జతుర్దశ సహస్రఖరప్రము ఖాసు రోగ్రులన్
నలిన దళాక్షుఁ డాజి రఘునాథుఁడె యర్ధ ముహూర్త వేళలో
నలి నలి సేసె మారుతి దినమ్మున నెన్బది వేల  రాక్షసేం
ద్రుల వధియించె లంకను విరోధుల సాక్ష కుమార వీరులన్   

2.         

 

 

 

చం.

కలవర మింత లేక రిపు కంటక భారత వీర సైనికుల్
సెలఁగి వధించి రుగ్ర రిపు సీమల నల్ప నిమేష కాల మం
దలయక భారతీయులకు నత్యధికమ్ముగ మాననీయులే    
జలనిధి వద్గభీరులకు సైనిక వర్యుల కెల్లఁ బ్రాంజళుల్ 

3.         

 

 

 

శా.

ఉన్మాదమ్ము మతాభిమానమున దుష్టోద్ధండ గుర్వాలికిం
గన్మోడ్పుం గలుగంగఁ జేయ రిపు సంఘాతాంత మర్హం బనం
దున్మాడుండు జనాలి నంచు ననిరే దుష్టాత్ములౌ పెద్దలే
సన్మానం బెటు లౌను మారణము హర్షం బందునే దైవమే  

4.         

 

 

 

ఉ.

భారత దేశ మెల్లపుడు పన్నుగ నెంచి మతమ్ము లన్నిటిన్ 
మూరుచు గౌరవించుఁ గద ముక్తికి మార్గముఁ జూపు నొజ్జయై
కోరును శాంతి నిక్కముగఁ గూరిమిఁ గోరును సంతతమ్మునున్
ధారుణిఁ గాంచ దేశములఁ దద్ద యశస్వి చరిత్రఁ గాంచినన్ 

5.         

 

 

 

శా.

 

సిందూ రాఖ్య మహోద్యమవ్రత చరత్సేనా త్రిభాగైక త
త్సందోహంబు పరాక్రమించి రిపు దేశస్థైర్య నాశంబు ని
స్సందేహం బొనరించి వాయు పద రక్షా క్షేత్ర విధ్వంసముం
గందర్పాంతక నేత్ర వహ్ని కణ సంకాశంబు గావించెనే

6.         

 

 

 

ఉ.

సింధు జలమ్ము లాపిరి యశేష రిపూదధిమేఖలా ప్రజా
స్కంధ విచార కారకము కర్మ వినాశకరమ్ము దౌత్య సం
బంధములం గుదించి రిపు పౌరుల రాకల పైన నాంక్షలన్
సంధిలఁ జేసి రెప్పటికి శత్రుల ఖిన్నులఁ జేసి రుగ్రులై     

7.         

 

 

 

ఉ.

భారము గాఁగ వృద్ధి కట వర్తక కార్య కలాపముల్ తెగెన్ 
దూరము లయ్యె బంధములు దూషిత మయ్యెను స్నేహ భావమే
క్రూరులు నుగ్ర వాదు లని లోకు లెఱింగిరి వారి నెల్లరన్
భారత దేశ వైర మతి భారము నా రిపు కోటి నేరెనే              
8.         

 








































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి