27, ఫిబ్రవరి 2023, సోమవారం

వైశాఖ పురాణము.

వైశాఖ పురాణము

పదునొకండవ యధ్యాయము.

[ఏకాదశాధ్యాయము _ 60 నుండి 89 శ్లోకముల కనువాదము]

ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.

 

 

 

 

యమధర్మరాజు, నరకమునఁ బాపులు లేక కార్య హీనమై యుండుటకుఁ గారణము నారదుఁ డడుగ, వివరించి దానికి మూల కారకుఁ డైన విష్ణుభక్తుఁ డైన రాజును జంపుటకుఁ దన దూతలతో నేఁగి యా రాజు పట్టణమును ముట్టడించి రాజుతో యుద్ధము చేయుట.    

 

 

 

 

మందాక్రాంతము.

60 శ్లో.

శ్రీ సప్తాశ్వుండు కదియఁగ సుశ్రేయమౌ మేష రాశిన్

గోసర్గ స్నాన మొనరుచ వ్యాకూతి భావమ్ము నందున్

వే సర్వాఘమ్ములు లయము కా విష్ణు ధామమ్ము నందున్

భాసిల్లన్ మానవున కిఁక సంప్రాప్తమౌ  భాగ్య మెంచన్

1.      

 

 

 

 

శ్రీ సూర్య భగవానుఁడు శ్రేయమైన మేష రాశినిఁ జేరఁగ నుదయపు స్నానము నే నెపమునఁ జేసినను సమస్త పాపములు తొలఁగుట వలన నరులు విష్ణులోకమును జేరు భాగ్యము పొందఁ గలరు.  

 

 

 

 

మహాస్రగ్ధర.

61-62.

ఘనమౌ స్నానమ్ము వైశాఖపు దివములలో గాత్ర సంశుద్ధి సేయం

జనఁ డొక్కం డైన వైవస్వతు వసతికి రాజా! రవంతైన వ్రాయం

గను గార్యం బౌర చూడంగఁ గఱ వయిన విఖ్యాతుఁడౌ చంద్రగుప్తా

ఖ్యునకున్ విశ్రాంతి వే కల్గుచుఁ దుడువఁ బడెన్  ఘోర పూర్వాఘ రేఖల్

2.     

 

 

 

 

ఓ రాజ! వైశాఖ మాసమున స్నానము సేయఁగ నే యొక్కఁడును యమ గృహమున కరుగరు. అందుచే చేయుటకు పని లేక చిత్రగుప్తుఁ డుండును. నరులు మునుపు చేసిన పాపముల వ్రాత లన్నియుఁ జెఱిపి వేయఁ బడినవి.  

 

 

 

 

స్రగ్ధర.

63-64.

వైశాఖ ప్రాభవంబే వఱల జన వరుల్ వైష్ణవుల్ విష్ణు ధామం

బా శుద్ధావాసముం జేయ వెడల గుణ కర్మావలిం జేసి శ్రద్ధన్

వే శూన్యం బాయెనే పాపి జన నరకమే ప్రేతరా ణ్మార్గ మందున్ 

లేశం బైనన్ నృ సంచారి గణ మరయమే రిక్త మయ్యెన్ నరేంద్రా!  

3.     

 

 

 

 

వైశాఖ మాస ప్రభావము వలన నరులు విష్ణు ధామమును జేరుకొనఁగ నరకము శూన్య మైనది. యమ లోకపు దారిలోఁ గూడ నర సంచారము లేదు. 

 

 

 

 

పృథ్వి.

65 -66.

దివౌకసుల లోక మింక పితృదేవు వేశ్మంబు నై

న వీత జనమై కనంబడఁగ నారదుం డేఁగుదెం

చి విస్మయము నంది కాలుఁ గని చిత్రమై దోఁచు  దే

వ! వీక్షణముఁ జేయఁగా ననుచుఁ  బల్కె నింకం దమిన్

4.     

 

 

 

 

దేవలోకము యమలోకము నరులు లేక శూన్యముగా నున్న సమయమున నారద మహర్షి వచ్చి యమునితో నిది చిత్రముగ నున్నదని పల్కి యిట్లనెను.   

 

 

 

 

నర్కుటము.

66-67.

వినఁబడ వెట్టి యార్పులును వింతగఁ బూర్వ విధ

మ్ము నరక మందు నేఁడు కతమున్ వచియింపుమ లే

ఖన ఘన చిత్రగుప్తుఁడు సుఖమ్ముగ మౌనమునన్

మునివరుఁ గూడి నిల్చె నిటఁ బో లిఖియింపకయే   

5.     

 

 

 

 

పూర్వము వలె నిక్కడ యెట్టి యఱుపులు వినఁ బడుట లేదు లేఖకుఁడు  చిత్రగుప్తుఁడు మౌనముగ నేమియు వ్రాయక మునీంద్రుని గూడి యుండుటకుఁ గారణ మేమి చెప్పు మనెను. 

 

 

 

 

మాలిని.

68-69.

దురితులు కప టాత్ముల్ దుష్టులున్ నీదు వేశ్మం

బరయ రది విచిత్రం బౌను దత్కారణంబుం

గరుణఁ బలుకవే నాఁ గాలుఁ డల్పంపు దీనుం

డరసి మునిని నా వాక్యజ్ఞుఁడే పల్కె నిట్లున్ 

6.     

 

 

 

 

పాపులు దుష్టులు నీ గృహమున లేరు. చిత్రముగా నున్నది. కారణమును జెప్పు మనఁగ దీన యముఁడు మునితో నిట్లు చెప్పఁ దొడఁగెను.

 

 

 

 

సుగంధి.

70-71.

నారదా! దరిత్రి నేఁడు నాథుఁ డైన పూరుషుం

డా రమేశుఁ డైన చక్రి కంచితంపు భక్తుఁడై

పౌర కోటిలోన నష్టవర్ష బాలు రింకనున్

మూర కెన్బదేండ్ల నింక భూమి నున్న వారునుం

బేరిమిన్ విశాఖ రిక్క పేరి మాస మంతయున్ 

భారమౌ వ్రతమ్ము నెమ్మి వారకుండఁ జేయుఁడీ

మీర లంచు నాజ్ఞ నీయ మీఱ మృత్యు దండనం

బే రయమ్మునం జెలంగు నెట్టి వారి కైననున్

7.     

 

 

 

 

నారద మునీంద్రా యిప్పటి రాజు విష్ణువునకు భక్తుఁడై పౌరు లందు నెనిమిది యేండ్లు దాటిన వారు  నెన్బది యేండ్లు లోపు వారును వైశాఖ మాసమున వైశాఖ ధర్మమును బాటింప వలె నని పాటింపని వారికి  మరణ శిక్ష యని చాటించెను.   

 

 

 

 

మహామంగళమణి.

72-73.

ధరణీ నాథో గ్రాజ్ఞను దాఁటక భీతి మదిన్ 

నరులే వైశాఖవ్రత నైపుణ మేర్పడఁగన్

గురు భక్తిం జేయంగ నకుంఠిత రీతి ధరన్

వర వైకుం ఠావాసము పన్నుగఁ గల్గుఁ దుదిన్

8.     

 

 

 

 

రాజాజ్ఞను భీతితో  దాట కుండ నెల్లరు భక్తితో వైశాఖ వ్రతములు పాటింపఁగా వారికి వైకుంఠ వాసము లభించు చున్నది.  

 

 

 

 

పంచచామరము.

74.

మునీంద్ర! రాజు నాజ్ఞ యట్లు మూర నాదు మార్గముల్

గనంగ శూన్య రీతి నుండఁగా సురాదిలోకముల్

వినా జనమ్ము లయ్యె నెల్ల వింత నారకమ్ము న

ట్లనే చెలంగు చుండె సుంత రంజనమ్ము లేకయే    

9.     

 

 

 

 

ఆ రాజు నాజ్ఞ వలన నా లోకము,  మార్గములు కూడ శూన్యము లైనవి. దేవలోకములు కూడ నట్లే యుండెను.

 

 

 

 

హరిణి.

75.

పని తన కిటన్   వ్రాయన్ లేకున్నఁ బాడిగ లేఖకుం

డనిశ మిట విశ్రాంతిం బొందంగ నా లిఖితమ్ములున్

మనవు జనులే చేయన్  వైశాఖ మాసపు సత్క్రియల్ 

సను నటుల నా మాహాత్మ్యంబే భృశమ్ముగ ధాత్రిలో

10.   

 

 

 

 

వ్రాయుటకుఁ బని లేకుండుట వలన చిత్రగుప్తుఁడు విశ్రాంతిఁ బొందెను. వ్రాసినవి కూడ మన లేదు. వైశాఖ మాసపు మాహాత్మ్య మట్లుండును.

 

 

 

 

డమరుక.

76.

యమి చంద్రా! బ్రాహ్మణ హత్య నగు పాప మణఁగున్

విమలుల్ వైశాఖమునన్ విరివిఁ జేయ వ్రతమున్

సమలం దింపార మహాశయము నూని హరి ధా

మము సంపాదింత్రు తగన్ మనుజు లెల్ల  గరిమన్   

11.    

 

 

 

 

మునీంద్రా బ్రాహ్మణ హత్యా పాపము కూడ నణఁగును బ్రతి యేడు వైశాఖ వ్రతములు సేయఁగ. వైకుంఠ వాసము ప్రాప్తించును.

 

 

 

 

మేదిని.

77.

నిలిచితిఁ గట్టె భంగిని మునివ్ర జాగ్రగణ్యా! 

విలయము గాఁగఁ గార్యములు వింత నివ్విధంబే

తలఁతును జంప నానృపతిఁ దద్ద బల్లిదుండై

వెలసిన భండనమ్మున నభీతి నెట్టు లైనన్   

12.   

 

 

 

 

పను లీ విధముగ నశింప నేను కఱ్ఱ వలె మిగిలితిని. అందుచే నా రాజును జంప నెంచితిని యతఁడు బలవంతుఁ డైనను. 

 

 

 

 

చంద్రభాను.

78.

అనుభవించు చుండి స్వామి యర్థ మింపు గొల్ప నా

తని యనుజ్ఞ నాచరింపఁ దల్పకుండి నిల్చినం

బనుల మాని యాతఁ డింక  వారకుండఁ గాంచు వే

గ నరకమ్ము నిశ్చయమ్ముగా మునీంద్ర వింటివే    

13.   

 

 

 

 

స్వామి ధనము ననుభవించుచు నాతని యాజ్ఞను నెరవేర్పక పనులు మానిన నతఁడు నరకమునకుఁ బోవును. (కావున నేను నా స్వామి యాజ్ఞలను నెరవేర్ప వలెను) 

 

 

 

 

సుకేసరము.

79.

అతఁడు నశింప కున్న నమ రానురాగ ముం

డి తిరముగాను వెల్గుచుఁ గడింది యేఁగి నే

నతి రయ మా విధాత దరి కంత నెల్లఁ బ

ల్కి తిరిగి వత్తు నింటికి సలీల నుంటకై     

14.   

 

 

 

 

దేవతల యండతో నాతఁడు మరణింప కున్న నేను వేగముగ బ్రహ్మను గాంచి వివరించి యింటికి నేఁగి సుఖముగ నుందును.

 

 

 

 

లయగ్రాహి.

80-82.

మౌనివరుఁ బంపి యని తా నటుల ధాత్రి నట సానుచర సంచయము నూని నిజ దండం

బా నునుపు దున్న కఱి మేనునను మృత్యువును మానితపు రోగమును మానుగ జ్వరమ్మున్

నా నరి భయంకరులు నైన భట సంతతిని నేను బదులౌ బలము నూని మఱి కోట్లన్

రానగరముం గదిసి యా నృవరు ముట్టడి నిదానముగఁ జేసి దర మూని వడి నూదెన్  

15.   

 

 

 

 

అట్లని మునినిఁ బంపి తన దండము నూని తన వాహనము దున్నపోతు నెక్కి యనుచరులతో దూతలు మృత్యువు, రోగము మఱియు జ్వరములు వెంట రాఁగ నేబది కోట్ల భటులతో నా రాచ నగరమును ముట్టడించి శంఖము నూదెను. 

 

 

 

 

అశ్వగతి.

83.

భీకర శబ్దము భూపతి వే విని కాలుని యా

రాక నెఱుంగఁగ స్వీయ బలమ్మును సిద్ధముగా

వీఁకను జేసి పురమ్మును వీడె నెదిర్ప రుషం 

దాఁక బలమ్ములు యుద్ధము  దందడి యయ్యె ధరన్   

16.   

 

 

 

 

ఆ భీకర నాదము రాజు విని యముఁడు వచ్చిన ట్లెఱిఁగి పురమునుండి వెడలి కోపముతోఁ దన బలమును సిద్ధము చేయఁగ యుద్ధ మతి భీకర మయ్యెను.

 

 

 

 

జ్ఞాన.

84-85.

ఓడించి క్షణములోన మహోగ్రుల రణ మందుం 

దోడుండు రుజను మృత్యువు దూత లగుచు రాఁగన్ 

వాడిం జెలఁగెడు గాలునిఁ బాఱఁగ నిఁకఁ జేసెం

గూడంగఁ బరులు వారినిఁ గూడ నటులఁ జేసెన్     

17.   

 

 

 

 

రణములో నా యుగ్ర వీరుల నొక్క క్షణములో నోడించి దూత లగు మృత్యువును, రోగమును, గాలునిఁ దఱిమి వేసెను. ఎదిరించిన నితరులను గూడ నట్లే చేసెను.     

 

 

 

 

తరళము.

86-87.

తనదు సేనలె యట్లు పాఱఁగ ధర్మరా జటఁ గాంచి రా

ణ్మునిని రోషము తో నెదిర్చె నమోఘ బాణ వితానముల్ 

దనర నేయుచు సింహనాదము తద్ద సేసెను వేగమే

ధనువుఁ ద్రుంచెను మూడు ముల్కులు దాను వేసి నరేంద్రుఁడే

18.   

 

 

 

 

తన సేన లట్లు పాఱఁగా యముఁడు కోపముతో నెదిర్చి యమోఘ మైన బాణములను వేసి సింహ నాదము చేసెను. ఆ బాణములను మూడు బాణములతో రాజు త్రుంచెను.

 

 

 

 

అంబురుహము.

87-88.

వేగమ కత్తినిఁ జర్మము గైకొని భీకరమ్ముగ రాజునున్ 

రేఁగఁగఁ గోపము చంపఁగ వచ్చెను లిప్త కాలమునం బగన్

రాఁగ నమర్షముతో నసిఁ జర్మము రాజు ద్రుంచి లలాట మం

దాగక యం బహి తుల్యము నాటఁగ నార్కి యెత్తెను దండమున్   

19.   

 

 

 

 

అంత యముఁడు వేగముగఁ గత్తిని డాలును దీసికొని పగతో రాజును జంప రాఁగ రాజు కోపముతో నా రెంటినిఁ ద్రుంచి సర్పమును బోలు బాణమును యముని నుదుట నాటఁగ యముఁడు తన దండము నెత్తెను.  

 

 

 

 

మేఘవిస్ఫూర్జితము.

89.

తగన్ బ్రహ్మాస్రంబున్ మదిఁ దలఁచి మంత్రమ్మునన్ దండ మంతం

బగం సంధింపంగన్ జన గణములోఁ బాఱె హాహాకృతమ్ముల్

జగానం దత్కాలమ్మున నరులు రక్షాగత ప్రాణులై గాం

చఁగన్ భీతిన్ యుద్దంబు నడరి యమక్ష్మాధవుల్ వీఁకఁ జేయన్    

20.   

 

 

 

 

బ్రహ్మాస్త్రమును మంత్రించి యముఁడు దండమును సంధింప నరులు భీతితో  రక్ష కోస మలమటించు ప్రాణములు గల వారై యతిశయించి యముఁడు రాజు నుత్సాహముతో యుద్ధము చేయు చుండఁగాఁ జూచు చుండ  జనువ్రాతములో నాహా కారములు చెలఁగినవి.